KTR | వరంగల్ : ఆసరా పెన్షన్లను ఎంతో పెంచబోతున్నామో.. స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటిస్తారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు.. ఆలోచించాలి. పెన్షన్లు పెరగాలనే ఆలోచన మీకుంది. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాట కూడా త్వరలోనే ప్రకటిస్తారు. మన పార్టీకి ఓటేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లు ఎంత పెంచబోతున్నామనే విషయాన్ని స్వయంగా కేసీఆరే ప్రకటిస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్లో వేల కోట్ల రూపాయాలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పలు సందర్భాల్లో మోదీ తెలంగాణ మీద విషం చిమ్మారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తల్లిని చంపిండ్రు బిడ్డను వేరు చేసిండ్రు అని తెలంగాణ పోరాటాన్ని కించపరిచేలా మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఉత్సవాలు జరగలేదని ఆయన మాట్లాడారు. భూమి దద్దరిల్లిపోయే జూలూస్లో జరిగాయి తెలంగాణలో. అట్లాంటిది జరగలేదంటూ మోదీ విషం కక్కుతుండు అని కేటీఆర్ మండిపడ్డారు.
60 ఏండ్లు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మాయమాటలు చెబుతూ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. తొమ్మిదిన్నరేండ్లలో ఎంతో అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు ఎట్ల ఉండే.. ఇప్పుడు కరెంట్ ఎట్ల ఉందో ఆలోచించాలి. కరెంట్ గురించి సిగ్గులేకుండా కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నారు. కరెంట్ కనవడ్త లేదట.. కరెంట్ కనవడ్తద ఎక్కడన్న నాకర్థం కాదు. కరెంట్ తీగల్లో ఉంటది. చూసేందుకు కేసీఆర్ లాగా సన్నగా ఉంటది. కానీ ముట్టుకుంటే, జాడిచ్చే తంతే అవతల పడ్తరని కేటీఆర్ అన్నారు.
24 అంతస్తుల్లో వరంగల్లో అతిపెద్ద హాస్పిటల్ నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దసరా నాటికి ఈ ఆస్పత్రి పూర్తవుతుంది. జూనియర్, డిగ్రీ కాలేజీలు కావాలంటే ఒకప్పుడు ధర్నాలు, యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని జిల్లాల్లో బ్రహ్మండంగా మెడికల్ కాలేజీలు వచ్చాయి. మన పిల్లలు మన కండ్ల ముందే ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్లు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు కేటీఆర్.
మన వరంగల్ కు ఐటీ కంపెనీలు వస్తున్నాయి.. ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగనట్టు కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ గట్టున స్కీమ్లు ఉన్నాయి.. ఆ గట్టున స్కామ్లు ఉన్నాయి. ఈ గట్టున ప్రజాసంక్షేమం ఉంది.. ఆ గట్టున 60 ఏండ్లు జనాన్ని పీక్కు తిన్నవారు ఉన్నారు అని కేటీఆర్ తెలిపారు. వినయ్ భాస్కర్ మాస్ లీడర్.. జనం ఈలలతో పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఇంత మాస్ లీడర్ వినయన్నా అనుకోలేదు. అదే స్పూర్తితో వినయ్ భాస్కర్ ను రికార్డు బద్దలయ్యే మెజారిటీతో గెలిపించాలి అని కేటీఆర్ కోరారు.