KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలి. తెలంగాణ కన్నా మెరుగైన మోడల్ రాష్ట్రాన్ని చూపించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 75 ఏండ్లు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఏం చేశాయి. మేం 9 ఏండ్లలో అభివృద్ధిలో అద్భుతాలు చేసి చూపించాం. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి. కేంద్ర మంత్రులు టాయిలెట్స్, రైల్వేస్టేషన్లలో లిప్ట్లు ఓపెన్ చేస్తున్నారు. మేం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ గత 10 ఏండ్లుగా నీళ్లు, నిధులు, నియామకాలన్న స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తోంది అని కేటీఆర్ తెలిపారు. అందులో తెలంగాణ విజయం సాధించింది. సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి సాధించింది. విద్య, వైద్య రంగంలో తెలంగాణలో అద్భుతమైన మార్పులు సాధించింది. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమగ్రమైన మార్పు వచ్చింది. విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు సాధించాం. తెలంగాణలో పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడా లేవు. అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన మార్క్ను చాటింది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోంది అని కేటీఆర్ వివరించారు.
రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. 9 ఏండ్లుగా ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో హేతుబద్ధత లేదు. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరు. మన పాలనను ఇతర రాష్ట్రాల పాలనతో బేరీజు వేసుకోవాలి. ఒకప్పుడు పంటలు పండని చోట నేడు ధాన్యం ఎక్కువైన పరిస్థితి నెలకొంది. ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.