పాలమూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. దద్దమ్మ మాటలు, పనికి మాలిన మాటలు, డైలాగులు, పొద్దున లేస్తే కేసీఆర్ను విమర్శించుడు కాదు. నిజంగా మహబూబ్నగర్ ప్రజల మీద బీజేపీకి ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు 500 టీఎంసీల నీటిని వెంటనే కేటాయించాలని సమావేశాల్లో తీర్మానం చేసి పంపాలి. దమ్ముంటే పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని తీర్మానం చేయాలి.
-మంత్రి కేటీఆర్
మహబూబ్నగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు వారిపై పన్నులు వేయాలని చూస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రైతులపై ఆదాయం పన్ను వేయాలని స్వయంగా ప్రధాని సలహాదారే సూచించటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వ వివక్షపై కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణకు ఏం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడికి వచ్చి ఓట్లడుగుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. ‘మోదీ గారూ రాండ్రి రాండ్రి.. పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయండి. ఏం ముఖం పెట్టుకుని వస్తావ్? ఏం ముఖం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతావ్? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోకాలడ్డినందుకు నీకు ఓట్లెయ్యాల్నా? కృష్ణా నీటిలో మా వాటా తేల్చకుండా నోట్లో మట్టికొట్టినందుకు ఓట్లెయ్యాల్నా? ఎందుకెయ్యాలి నీకు ఓటు’ అని నిలదీశారు.
ఈ ఎనిమిదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు మోదీ సర్కారు రూ.12 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిందని, ఇది అబద్ధమైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఆ డబ్బులతో దేశవ్యాప్తంగా రైతులకు 10 ఏండ్లపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వొచ్చని తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.196 కోట్లతో నిర్మించనున్న నూతన కలెక్టరేట్, ఎస్పీ భవన సముదాయాలతోపాటు 12 పనులకు మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ మాట్లాడారు. మోదీని ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ నేతలు తిట్ల దండకం, బూతుపురాణం అందుకొంటున్నారని విమర్శించారు. ‘ఇక్కడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడున్నరు. ఆయనేమో మోదీ దేవుడయ్యా దేవుడు అని అంటడు. ఎవరికి దేవుడు? మోదీ ఎసొంటోడో మా ఆడబిడ్డలను అడిగితే చెప్తారు. గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ.400 ఉంటే, ఇయ్యాల రూ.1200 చేసిండు. అలాంటి మోదీ ఆడబిడ్డలకు దేవుడా? గ్యాస్ సిలిండర్ ధర పెంచి మళ్లీ కట్టెల పొయ్యిపాలు చేసినందుకు మోదీ దేవుడా? మోదీ రాకముందు లీటర్ పెట్రోల్ ధర రూ.70. ఇయ్యాల రూ.110. పెట్రోల్ ధర పెంచినోడు దేవుడా?’ అని నిలదీశారు. 70 ఏండ్లలో దేశాన్ని పాలించిన 14 మంది ప్రధానుల హయాంలో రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ఒక్క నరేంద్రమోదీ గత ఎనిమిదిన్నరేండ్లలోనే 100 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.
ఇయ్యాల దేశంలో పుట్టే ప్రతి బిడ్డమీద రూ.1.25 లక్షల అప్పు మోపుతున్నది బీజేపీ కాదా ? అని ప్రశ్నించారు. ‘వంద లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు. పెట్రోల్, డీజీల్మీద అదనంగా సెస్ వేసి మరో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారు. ఈ సొమ్మును ఏం చేశారో చెప్పే ముఖం కేంద్రానికి లేదు. నిన్నమొన్న కొత్తరాగం అందుకొన్నరు. మేం నేషనల్ హైవేలు కడ్తలేమా.. జాతీయ రహదారులు, ఎయిర్పోర్టులు కడ్తలేమా? అని చెప్తున్నరు. హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు వస్తే మీరు టోల్ కడ్తలేరా? టోల్ పేరుమీద తోలుతీసి వసూలు చేసినంక నీవు కట్టిన జాతీయ రహదారి ఎట్ల అయితది?’ అని ప్రశ్నించారు.
దమ్ముంటే తీర్మానం చేయండి
బీజేపీ నేతలకు దమ్ముంటే కృష్ణా నీటిలో 500 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘పాలమూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ సొల్లు ఏదో మాట్లాడుకొంటున్నారు. నిజంగా మహబూబ్నగర్ ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు 500 టీఎంసీల నీటిని వెంటనే కేటాయించాలని మోదీని డిమాండ్ చేస్తూ సమావేశాల్లో తీర్మానం చేసి పంపాలి. దద్దమ్మ మాటలు, పనికి మాలిన మాటలు, డైలాగులు, పొద్దున లేస్తే కేసీఆర్ను విమర్శించుడు కాదు.. చేతనైతే పాలమూరు వేదికగా తీర్మానం చేయండి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని ఇక్కడికి రాబోతున్న ప్రధానిని డిమాండ్ చేస్తూ దమ్ముంటే తీర్మానం చేయాలి.
మీరు దద్దమ్మలు కాకపోతే, చేతకానోళ్లు, అసమర్థులు కాకపోతే.. తెలంగాణ బీజేపీ శాఖకు వెన్నెముక ఉంటే ఆ తీర్మానం చేయాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చిత్తశుద్ధి చాటుకోవాలి’ అని సవాల్ చేశారు. కేంద్రం వాటా తేల్చకపోయినా కృష్ణానదిలో అవసరం ఉన్నంత మేరకు నీళ్లను వాడుకొని ఒక్క పాలమూరు జిల్లాలోనే 11 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక 95 శాతం లోకల్ రిజర్వేషన్లు కల్పించి రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. నారాయణపేట లాంటి కొత్త జిల్లాల్లో వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
దేశం కోసం ధర్మం కోసం కాదు.. అదానీ, అంబానీ కోసమే
బీజేపోళ్లు దేశం కోసం.. ధర్మం కోసం అంటారు కానీ, ఇద్దరు వ్యక్తుల కోసమే దేశాన్ని నడుపుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నష్టం వస్తున్నదని చెప్తూ, వాటిని ఆ ఇద్దరికి ధారాదత్తం చేస్తున్నారు. చివరకు ఈ ఇద్దరు తమ కంపెనీలు లాస్ అయ్యాయని కేంద్రానికి విన్నవిస్తే అప్పులు మాఫీ అయిపోతున్నాయి’ అని ఆరోపించారు. ఈ ఎనిమిదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు మోదీ సర్కారు రూ.12 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిందని, ఇది అబద్ధమైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఆ డబ్బులతో దేశవ్యాప్తంగా రైతులకు 10 ఏండ్లపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వొచ్చని అన్నారు.
ఉచిత విద్యుత్తుకు సంవత్సరానికి రూ.లక్ష కోట్లు మాత్రమే అవసరం అవుతాయని, ఈ పని చేయకుండా కేంద్రం ఉన్నోళ్లకే దోచిపెడుతున్నదని విమర్శించారు. 2022 నాటికి బీదోళ్లకు ఇండ్లు కట్టిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీలు ఇచ్చి అందరి నోళ్లల్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ‘ప్రధాని సలహాదారు వివేక్ దేబ్రాయ్ ఒక పేపర్లో ఆర్టికల్ రాస్తూ రైతులపై ఆదాయ పన్ను వేయాలని సూచించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటదా? రైతుల ఆదాయాన్ని పెంచేది పోయి, పన్ను వసూలు చేయాలనే దుర్మార్గమైన ఆలోచన కేంద్రం చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ కొడ్తాం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పనిమంతులకు పట్టం కట్టాలని ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ కొట్టేలా దీవించాలని కోరారు. 2024లో కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చేలా చేసుకొందామని తెలిపారు. రైతు వ్యతిరేకులను, పేదల వ్యతిరేకులను, ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టి నాశనం చేస్తున్న వాళ్లను తిప్పి కొట్టాలని పిలునిచ్చారు. దేశంలో ఇంతవరకు మోదీ లాంటి అసమర్థ ప్రధాని రాలేదని ధ్వజమెత్తారు. సమావేశంలో మంత్రులతోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహాం, జైపాల్యాదవ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీ చైర్మన్ వనజ, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్ ఇసాక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.