హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ‘రిడ్యూస్, రీసైకిల్, రీయూజ్’ అనే ట్రిపుల్ అర్ మం త్రాన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే నగరాలు, పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి శనివారాన్ని రీథింకింగ్ దినంగా పాటిద్దామని పిలుపునిచ్చారు. సోమవారం ఖైరతాబాద్ ఆస్కి కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రీథింక్ కార్యక్రమాన్ని, ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ ల్యాబోరేటరీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బాగా పనిచేయాలన్నా, నగరాలు, పట్టణాలు బాగుపడాలన్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే సాధ్యం కాదని స్పష్టంచేశారు. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ అగ్రభాగంలో ఉన్నదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ తన నివేదకలో పేర్కొన్నదని గుర్తు చేశారు.
మనకు ప్రపంచంతోనే పోటీ
హైదరాబాద్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. మర్సర్ సంస్థ 2015 నుంచి 2020 వరకు భారతీయ నగరాల్లో హైదరాబాద్ను ఉత్తమ నివాసయోగ్య నగరంగా ప్రకటించిందని, అయితే ప్రపంచవ్యాప్త నగరాల్లో 142వ ర్యాంకులో ఉన్నదని కేటీఆర్ తెలిపారు. అందుకే హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి కొంత సమయం పడుతుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో సర్క్యులర్ ఎకానమీపై ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, జలమండలి మధ్య ఎంవోయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిశోర్, ఆస్కి ప్రొఫెసర్ శ్రీనివాస్చారి, యూనిసెఫ్ ప్రతినిధి సీమాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో రోడ్లు, పచ్చదనం అద్భుతం
హైదరాబాద్ను నివాసయోగ్య నగరంగా మార్చారని ఆస్కి చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య అన్నారు. హైదరాబాద్ వండర్ఫుల్ సిటీ అని కొనియాడారు. తాను గతంలో ముంబై కమిషనర్గా చేసిన అనుభవంతో కార్పొరేటర్లు, మేయర్ల సమావేశంలో తనను సీఎం కేసీఆర్ మాట్లాడమని చెప్పారు. కేసీఆర్ అంటే ‘కీప్ ది సిటీ రన్నింగ్’ అనే అర్థాన్ని చెప్పినట్టు పేర్కొన్నారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రోడ్లు అద్భుతంగా కనిపిస్తున్నాయి.. రోడ్లకు ఇరువైపులా ఎక్కడా చూసినా పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి.. గతంలో తెలంగాణలో ఎక్కడా చూసినా డ్రైలాండ్ ఉండేది. ఇప్పుడు పంటలు, పచ్చని చెట్లు కనిపిస్తున్నాయని ఆంధ్ర మిత్రులు చెప్తున్నారు.. దుర్గంచెరువు, మల్కంచెరువుతోపాటు అనేక చెరువులు బాగుపడ్డాయని పద్మనాభయ్య చెప్పారు.