KTR | అన్నా ఆపదలో ఉన్నా ఆదుకోమంటూ వేడుకోగానే స్పందించే గుణం. పార్టీ జెండా మోసిన కార్యకర్త అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కై అండగా నిలిచిన పెద్దన్న. తోడూనీడా లేని మహిళలకు గూడు కట్టించిన మనసున్న మారాజు రామన్న. ఇలా ఎంతోమందికి తానున్నానంటూ భరోసా ఇస్తూ స్థానిక శాసనసభ్యుడిగా, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ సిరిసిల్ల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నేరుగా కలిసి చెప్పుకొన్నా.. ట్విట్టర్, వాట్సాప్లో సందేశం పంపించినా తక్షణం స్పందించి ఆపన్నహస్తం అందించే కేటీఆర్ వెంటే ఉంటామంటున్నారు సిరిసిల్ల ప్రజలు.
మా నాన్న కత్తెర చొక్కారాం. అమ్మ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్లో ఉంటాం. నాన్న కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేశారు. కేటీఆర్ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత సిరిసిల్లను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రామన్నపై అభిమానంతో మా నాన్న బీఆర్ఎస్లో చేరారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో 2016లో నాన్న చనిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చి నివాళులర్పించారు. మా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి పరిశ్రమల శాఖలో నాకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించారు. రామన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-కత్తెర పవన్కుమార్, సిరిసిల్ల
మాది వీర్నపల్లి మండలం గర్జనపల్లి. నా భర్త దేవేందర్. నాకు ఇద్దరు ఆడపిల్లలు. కేటీఆర్పై ఉండే అభిమానంతో మా ఆయన బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారు. నేను బీడీల పని చేస్తుంటా. ఈ ఏడాది జనవరిలో మా ఆయన గుండెపోటుతో చనిపోయిండు. పరామర్శించేందుకు వచ్చిన రామన్న మా ఆడ పిల్లలను చూసి ‘బాధపడకమ్మా నేనున్నా’ అంటూ ధైర్యం ఇచ్చిండు. ఇద్దరు బిడ్డల పేర్ల మీద రూ. 2.50 లక్షల చొప్పున రూ.5 లక్షలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, బాండ్ పేపర్లు తెచ్చి మా చేతికిచ్చిండు. మా కుటుంబానికి అండగా నిలిచిన మా పెద్దన్న రామన్న భారీ మెజారిటీతో గెలువాలే.
-ఈసంపల్లి హేమ, వీర్నపల్లి
నా భర్త సత్తయ్య సాంచాలు నడుపుతడు. మాకు ఇద్దరు ఆడబిడ్డలున్నరు. మా ఇండ్ల అందరూ బీడీల పనే జేస్తరు. బీడీల కంపెనీలు సరిగ్గా నడుస్తలేవు. ఏడాది కిందట కుట్టు పని నేర్చుకున్నా. మా వార్డు కొచ్చిన కేటీఆర్ సారుకు ‘బీడీల పని లేకుంట పోయింది. ఏదైనా పని కల్పించాలి’ అని చెప్పినం. మీ అందరి కోసం కంపెనీలు పెట్టిస్తున్నానన్నరు. అందులో ఉపాధి దొరుకుతుందని చెప్పారు. అన్నట్లే అప్పారెల్ పార్కులోని గ్రీన్ నిడిల్ కంపెనీలో పని కల్పించిర్రు. నాతో పాటు వెయ్యి మందికి పని దొరికింది.
-ఆడెపు ఉమారాణి, నేత కార్మికురాలు
నా లాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మాది రామచంద్రాపూర్, తంగళ్లపల్లి మండలం. నా పెనిమిటి నర్సయ్య. ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ ఉన్నరు. కూలీ పనికి పోతుంటిమి. ఎనిమిదేండ్ల కింద నా పెనిమిటి ఆరోగ్యం బాగా లేక చనిపోయిండు. ఆయన పోయిన ఏడాదికే పెద్ద కొడుకు చనిపోయిండు. బిడ్డ వసంతకు పెండ్లి చేస్తే మొగుడు వదిలిపెట్టి పోయిండు. ఇద్దరు కొడుకులతో కలిసి నా బిడ్డ వసంత నా వద్దనే ఉంటున్నది. నా మనుమడు రోహిత్ మురుగు కుంటలో పడి చనిపోయిండు. మరో మనుమడు రమేశ్ పసీర్కలై చనిపోయిండు. నా చిన్న కొడుకు ప్రభాకర్ పెండ్లి అయిన ఆరు నెలలకే కాలం జేసిండు. పెనిమిటి, కొడుకులు, మనుమలు అందరూ పోయినంక ఈ బతుకు మీద రోత పుట్టింది. 2017లో మా ఊరికొచ్చిన కేటీఆర్ను కలిసిన. ఊరి వాళ్లు కేటీఆర్కు నా బాధ చెప్పిండ్రు. ఏడుస్తున్న నన్ను దగ్గరకు తీసుకుని అవ్వా నీకు నేనున్న అని ఓదార్చిండు. రూ.7 లక్షలు సొంత పైసలతో మంచి ఇల్లు కట్టించిండు. నా బాగోగులు చూసుకుంటున్న పెద్ద కొడుకున్నడన్న కొండంత ధైర్యం వచ్చింది.
-మేడిపల్లి నీలవ్వ, రామచంద్రాపూర్
…? రాపెల్లి సంతోష్కుమార్