హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతోన్న విద్యా యజ్ఞంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. న్యూజెర్సీలోని ఎడిషన్ టౌన్ షిప్లో మన ఊరు – మన బడి ఎన్ఆర్ఐ పోర్టల్ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేపట్టిన విద్యా యజ్ఞానికి తెలంగాణ ప్రవాసులు భారీగా విరాళాలు ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, వాటి రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. అది నిజానికి మన ఊరు – మన బడి కార్యక్రమం కాదు.. విద్యా యజ్ఞం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ యజ్ఞంలో భాగంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం రూ. 7,300 కోట్లు కేటాయించారని తెలిపారు. ఎన్ఆర్ఐలు కూడా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కేటీఆర్ కోరారు.
21 ఏండ్ల క్రితం ఏర్పడ్డ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రాలు ఇంకా కుదుటపడలేదు. కానీ ఏడున్నరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. లక్షా 24 వేలు ఉంటే.. ఏడేండ్ల తర్వాత రూ. 2 లక్షల 78 వేలకు పెరిగిందన్నారు. జీఎస్డీపీ 2014లో రూ. 4.9 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ. 11.54 లక్షల కోట్లకు చేరిందన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో ఎంతో పురోగతి సాధించింది. భౌగోళికంగా అతిపెద్ద 11వ రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 12వ రాష్ట్రం. దేశానికి ఆదాయం సమకూరుస్తున్న అతి పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 4వ రాష్ట్రంగా ఉందని ఆర్బీఐ నివేదికలో వెల్లడైందన్నారు. ఏడున్నరేండ్ల తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోందన్నారు. తాను చెప్పేవన్నీ సొంత గణాంకాలు కాదు.. మోదీ గణాంకాలు అని కేటీఆర్ స్పష్టం చేశారు.