KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తేసి, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తారట.. పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
గతంలో తెలంగాణలో ఒక రైతు భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే చేయి తడపనిదే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. అంతేకాదు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతదో, మ్యుటేషన్ ఎప్పుడు అయితదో తెలవని పరిస్థితి. మన చేతుల్లో ఏం ఉండేది కాదు. వాళ్ల దయ మన ప్రాప్తం. ధరణి వచ్చిన తర్వాత అన్ని లేయర్స్ పోయాయి. వీఆర్వో, వీఆర్ఏ, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్ ఇలా ఎనిమిది లేయర్స్ తీసేశాం. ధరణి ద్వారా రైతుల వేలి ముద్రకు అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీ భూమి రికార్డును ఎవరూ ట్యాంపర్ చేయకుండా మీకు అధికారం ఇచ్చారు. ధరణి తీసుకొచ్చింది కేసీఆర్. ధరణిలో లోటుపాట్లు ఉండొచ్చు. మేం లేవు అనట్లేదు. కానీ ఇవాళ భూమాత అని తెస్తున్నారు. తిరిగి పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్నారు. పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ. పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చిన వారిని ఆశీర్వదిద్దామా.? లేదా ధరణి తెచ్చి, భూముల రిజిస్ట్రరేషన్లో పారదర్శకత తెచ్చిన వారిని ఆశీర్వదిద్దామా ప్రజలు ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు.