KTR | హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ముఖ్యమంత్రులం అవుతామని ప్రకటించుకుంటున్నారు.. చివరకు ఎన్నికల పోటీలో లేని జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది.. పదవులు వెతుక్కుంటూ వస్తాయని అంటున్నారు. కానీ సీఎం కుర్చీ ఖాళీ లేదు.. మా నాయకుడు కేసీఆర్ ఉన్నడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ బూత్ కమిటీల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సీఎంగా కేసీఆరే ఉంటడు అనే మాట గట్టిగా మనందరం కూడా చెప్పాలి. మన మీద ఈ పక్క రాష్ట్రం నాయకుల దాడి ఏంది..? నాకు అర్థం కాదు. ఓ డీకే శివకుమార్, ఇంకెవడో సిద్ధరామయ్య వీళ్లందరూ మనకు అవసరమా..? మన నాయకుడు మనకు ఉండగా, వీళ్లందరు ఎందుకు బయటోళ్లు అని కేటీఆర్ నిలదీశారు.
ఈ సన్నాసులు మనకు అవసరమా..? బెంగళూరు, గుజరాత్ నాయకులు మనకు అవసరమా..? ఇక్కడ ఉండే సమస్యలను పరిష్కారం చేయలేని దద్దమ్మలు.. బీ ఫామ్స్ కోసం ఢిల్లీ పోయేటోళ్లు. టికెట్ల కోసం ఢిల్లీలో తిరిగే దద్దమ్మలు మనకు ఏం న్యాయం చేస్తరు ఆలోచించండి. రేపటి రోజున కాంగ్రెసోడు, బీజేపోడు నిర్ణయం తీసుకోవాలంటే వారికి నిర్ణయాధికారం ఉండదు. మోదీ, రాహుల్ చెప్పినట్లు వింటరు. అలాంటి సన్నాసులను మళ్లీ ఒక్కసారి నెత్తిన పెట్టుకుని మళ్లీ ఆగమైదామా.. వాస్తవాలు ఏందో ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు.
కాంగ్రస్ పార్టీ కరెంట్ సమస్యను పరిష్కరించలేకపోయింది. వ్యవసాయాన్ని, పరివ్రమలను నాశనం చేసింది. మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. పదవులు తప్ప ప్రజలను పట్టించుకున్నది లేదు. కొద్దిగా ఏమైతదిలే అంటే మొదటికే మోసం వస్తది ఆలోచించండి. రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి కరువు లేదు.. కర్ఫ్యూ లేదు. హిందూ ముస్లిం పంచాయితీ లేదు. ఆంధ్రా తెలంగాణ పంచాయితీ లేదు. కులాల పంచాయితీ లేదు.. కుంపట్లు లేవు. భారతదేశంలో ఏం జరుగుతుందో చూడండి. పార్లమెంట్లో ఓ ముస్లిం ఎంపీని పట్టుకుని నువ్వు ముస్లిం, ఉగ్రవాదివి అని బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నారు. అలాంటి దిక్కుమాలిన పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. కులం, మతం పేరుతో మన దగ్గర దూషించుకోవడం లేదు. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎక్కడా లేడు. స్థిరమైన నాయకుడు, సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే మన నగరం బాగుంటది. మన బతుకులు బాగుంటాయి. ఎవరికి అంటే వారికి అధికారం ఇస్తే మన నగరం, బతుకులు ఆగమవుతాయి అని కేటీఆర్ సూచించారు.