హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): దేశానికి తెలంగాణ మాడల్ అత్యవసరమని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో భారత్లో తెలంగాణ రాష్ట్రమే మొదటిస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. యూకే పర్యటనలో భాగంగా లండన్లో శనివారం నిర్వహించిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2023’ అంతర్జాతీయ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. గత 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అద్బుతమైన పురోగతి సాధించిందని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు. ‘భారతదేశానికి అనేక సహజసిద్ధ అవకాశాలు, ప్రయోజనాలు, ఖనిజ వనరులు, నదులు, ఉప నదులు, నీటి సంరక్షణ కేంద్రాలున్నాయి. అయితే వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికైనా మనం సరైన ప్రణాళికతో ముందుకెళ్తే చైనా 30 ఏండ్లలో సాధించింది భారతదేశం 20 సంవత్సరాల్లో సాధించగలదు.
జనాభాలో 67 శాతం 15- 64 ఏండ్ల మధ్యవారే ఉన్నారు. ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సృష్టించేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలి. తెలంగాణ గతంలో కరువు ప్రాంతంగా ఉండేది. రైతులు నీటి కోసం అనేక బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోయారు. కొన్నిసార్లు ఆర్థిక భారం కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఫ్లోరోసిస్ సమస్యతో బాధ పడ్డారు. రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పంట పొలాలతో తెలంగాణ పచ్చగా మారింది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచింది’ అని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలకు నాంది పలికిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘సాగునీరు, రైతు సంక్షేమ, ఇతర సంస్కరణల్లో మనం చేసిన పనుల వల్లనే తెలంగాణలో ఐదు విప్లవాలకు పునాది పడింది. విద్యుత్తు, వైద్య, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక రంగాలు ఎంతో వృద్ధి సాధించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తలసరి ఆదాయం 2.5 రెట్లు పెరిగింది. దేశ జనాభాలో 2.5 శాతమే ఉన్నా.. దేశ జీడీపీకి 5 శాతం వాటాను అందిస్తున్నది. హైదరాబాద్ నగరం ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలకు నిలయంగా ఉన్నది. నూతన ఆవిష్కరణల హబ్గా ఆవిర్భవిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ను నిర్మించాం. టీ వర్క్స్ భారతదేశపు అతిపెద్ద నమూనా కేంద్రం. వీ హబ్ భారతదేశపు మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్. గ్రామీణ ఆవిష్కర్తలకు సహాయం చేయడానికి టీఎస్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటుచేశాం. టాస్క్ ద్వారా గ్రాడ్యుయేట్స్కు దిశానిర్దేశం చేస్తున్నాం.
హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 240 కోట్ల మొక్కలు నాటాం. దీని ద్వారా 7 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విక్టర్ హ్యుగోను మంత్రి కేటీఆర్ ఉటంకించారు. సమయానికి వచ్చిన ఆలోచన కంటే ఏదీ శక్తిమంతం కాదని, దేశంలో తెలంగాణ మాడల్ ఆలోచన అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. వచ్చే 20 సంవత్సరాల్లో భారతదేశం తలసరి ఆదాయాన్ని ఆరు నుంచి ఎనిమిది రెట్లు పెంచుకోవడానికి అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ను బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు వీరేంద్రశర్మ, లండన్ ఫర్ బిజినెస్ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, యూకే మధ్య పెట్టుబడుల అంశంపై చర్చించారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ లేఖ రాసినందుకు వీరేంద్ర శర్మకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.