హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ ఉత్సవాలు జరుపుకునే రోజులు రావాలని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. మహిళలను, అమ్మాయిలను గౌరవించే సంస్కారం అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే నేర్పాలని తల్లిదండ్రులకు సూ చించారు. సమాజంలో మహిళలపై జరిగే దాడులు, అకృత్యాలను పిల్లల పెంపంకంలోని లోటుపాట్లు కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ పీపుల్స్ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 138 మంది మహిళా జర్నలిస్టులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సీఎస్ శాంతికుమారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల కోసం వీ-హబ్ ద్వారా ఉమెన్ ఇన్ జర్నలిజం లీడర్షిప్ ఆక్సిలరేటెడ్ ప్రోగ్రాం-2023 నిర్వహిస్తామని ప్రకటించారు. ఇలాం టి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అని, రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో కొత్తగా జర్నలిజంలోకి రావాలనుకుంటున్న ఔత్సాహికులు కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో లోటుపాట్లు రాయడానికే పరిమితం కాకుండా సంక్షేమ పథకాల విజయాలను కూడా ప్రసారం చేయాలని కోరారు.
విద్యాశాఖ జెండర్ సెన్సిటివిటీ గురించి పాఠాలు బోధిస్తున్నదని, దీనికి మీడియా కూ డా ప్రచారం కల్పించాలని కేటీఆర్ కోరారు. నాయకులు తప్పు చేస్తే చీల్చి చెండాడే హక్కు మీడియాకు ఉంటుందని, అదే సమయంలో పాజిటివ్ న్యూస్ కూడా ప్రసారం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియా లేకుంటే సమాజం బ్యాలెన్స్ తప్పుతుందని అభిప్రాయపడ్డారు. కల్యాణలక్ష్మి ద్వారా బాల్య వివాహాలు తగ్గడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 62 శాతానికి పెరగడం, నిమ్స్లో ఒకే నెలలో 15 కిడ్నీ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం, మాతాశిశు మరణాలు తగ్గడం లాంటి అనేక అంశాలపై పాజిటివ్ దృక్కోణంలో వార్తలు కవర్ చేయవచ్చునని ఉదహరించారు.
కొన్ని మీడియా సంస్థలు మహిళలపై దాడులు జరిగితే ప్రభుత్వంలోని వారికి స్పందన లేదన్నట్టుగా, వారి కి సానుకూల దృక్పథమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని.. ఇది సరికాదని హితవు పలికా రు. జర్నలిస్టులది మున్సిపల్ శాఖ లాగా కృతజ్ఞతలేని ఉద్యోగమంటూ సానుభూతిని వ్యక్తంచేశారు. రెండింటిలోనూ మంచిగా పనిచేస్తే అభినందించే వారు ఉండరు కానీ, ఒక్క చిన్న తప్పు జరిగితే మాత్రం తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పా రు. మహిళా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చాలా కష్టపడుతుంటారని ప్రశంసించారు. రాష్ట్రంలో 19 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వగా గుజరాత్లో 3 వేల మందికే ఇచ్చారని స్పష్టం చేశారు.
మహిళా సాధికారత, మహిళల సంక్షేమం గురించి మాటల్లో కాకుండా చేతల్లో చూపించే నాయకుడు సీఎం కేసీఆర్ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. మహిళలకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పించే విషయంలో కేసీఆర్ ముందుంటారని చెప్పారు.
మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నదని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళల కష్టాలు, ఇబ్బందులు గుర్తించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, అసరా పింఛన్లు అందజేస్తున్నారని వివరించారు. మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాంటి అత్యున్నత పదవిని మహిళకు కట్టబెట్టారని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, కోరుకంటి చందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, ఐఅండ్ పీఆర్ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, కిశోర్బాబు, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కే వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వర్లు, ఎస్ఏ హష్మి తదితరులు పాల్గొన్నారు.