సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరంచేయాలని కేంద్రం కుట్ర. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మిక బిడ్డల కృషితో ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనే వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. సంస్థను ప్రైవేటుపరం చేస్తే, ఇకనుంచి ‘నష్టాల మూటలు’ అనేవి ప్రధాన శీర్షికలవుతాయి. లాభాల్లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు లేకుండా చేసి సంస్థను చంపే కుట్ర. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దళితులు, బహుజనులపై కేంద్రం చేస్తున్న దండయాత్ర.
-మంత్రి కేతారకరామారావు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 : నల్ల చట్టాలతో నిన్న రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా ముంచేందుకు కుతంత్రాలు పన్నుతున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణి లాంటి సంస్థను దెబ్బతీయాలని చూస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు కోలుకోలేని విధంగా దెబ్బతినడం ఖాయమని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తే.. బీజేపీపై తెలంగాణ సమాజం రాజకీయంగా వేటువేయడానికి సిద్ధంగా ఉన్నదన్నారు. సిరులు కురిపించే సింగరేణి కార్మికుల సెగ ఢిల్లీకి తగులుతుందని స్పష్టంచేశారు. సింగరేణి పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తూ.. మంత్రి కేటీఆర్ సోమవారం బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్జోషికి ఘాటైన లేఖ రాశారు. కేంద్రం మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని లేఖలో తెలిపారు. సింగరేణిని ఎలాగైనా కాపాడుకొంటామని, సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సింగరేణిలో ఉన్న జేబీఆర్ ఓసీ -3, కేకే -6, శ్రవణపల్లి ఓసీ, కోయగూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా, వేలంలో పాల్గొనాలని నిర్దేశించడాన్ని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిని బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి.. వేలంలో పాల్గొనాలని పేర్కొనడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. బొగ్గు బ్లాకులను సింగరేణికి నేరుగా కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పడిననాటి నుంచి గత ఏడేండ్లలో 450 లక్షల టన్నుల నుంచి 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పీఎల్ఎఫ్ను కలిగి ఉన్నదని కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. సింగరేణి రాష్ర్టానికే పరిమితం కాకుండా మహారాష్ట్రతోపాటు పలు దక్షిణాది రాష్ర్టాల్లోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా చేస్తూ దేశంలో విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదని తెలిపారు. సింగరేణి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లోనూ కార్యకలాపాలను విస్తరిస్తూ సంస్థ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నదని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థ ఇవ్వని విధంగా లాభాల్లో 29% వాటా ఇస్తున్న ఏకైక సంస్థ సింగరేణి అని కేటీఆర్ పేర్కొన్నారు.
బొగ్గు కార్మికుల కోసం ఏ ప్రభుత్వరంగ సంస్థ చేయనన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, సింగరేణి కార్మిక బిడ్డల కృషితో ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనే వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయని, సంస్థను ప్రైవేటుపరం చేస్తే, ఇకనుంచి ‘నష్టాల మూటలు’ అనేవి ప్రధాన శీర్షికలవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి, అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కావాల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసి.. ఇప్పుడు ప్రైవేటీకరించేందుకు రెడీ అయిందని ప్రస్తావించారు. కేంద్రం దగ్గర ఇప్పటికే స్టీల్ప్లాంట్కు సంబంధించి 27 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణికి సైతం బొగ్గు గనులు లేకుండా చేసి సంస్థను చంపే కుట్రకు తెర లేపిందని కేటీఆర్ విమర్శించారు. గుజరాత్లో అడిగిన వెంటనే లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్థకు కేటాయించిన కేంద్రం.. తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో గుజరాత్కో విధానం, తెలంగాణకొక విధానం ఉన్నదని విమర్శించారు. తెలంగాణ దేశంలోని రాష్ట్రం కాదా? అని నిలదీశారు. ఇది కేవలం సింగరేణి సంస్థపై మాత్రమే వివక్ష కాదని, ఇది తెలంగాణపై వివక్ష అని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, ఈ కుట్రలను అపకుంటే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
సింగరేణి అంటే కోల్మైన్ మాత్రమే కాదని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్మైన్ అని కేటీఆర్ కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక 16 వేల నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలను సింగరేణి కల్పించిందని తెలిపారు. కేంద్రం లేవనెత్తిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దళితులు, బహుజనులపై కేంద్రం చేస్తున్న దండయాత్రగా మంత్రి అభివర్ణించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్గా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటీకరించడమంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడవడమేనని అన్నారు. రిజర్వేషన్లకు పాతరేసే ఈ కుతంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వబోమని హెచ్చరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ యువతకు ఉద్యోగాల గని, సింగరేణి అని స్పష్టంచేశారు.
తమ దృష్టిలో కేంద్రం సింగరేణిలోని నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడంలేదని, వేల మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్లో వేలం వేస్తున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ వేలంవెర్రి ఆలోచనలను కేంద్రం ఇప్పటికైనా మానుకోకపోతే, ఎన్నో వీరోచిత పోరాటాలకు, ఉద్యమాలకు కేరాఫ్గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కు పిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం తథ్యమని ఆయన హెచ్చరించారు.
సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశముండదని, పైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రమాదం పొంచి ఉన్నదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అవకాశాలు పోతాయని తెలిపారు. అంతిమంగా సింగరేణి సంస్థ కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణి ద్వారా రాష్ట్రంలోని రెండు వేల పరిశ్రమలకు బొగ్గు సరఫరా అవుతున్నదని, దీన్ని ప్రైవేటుపరం చేస్తే ఆయా పరిశ్రమలకు బొగ్గు సరఫరా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోతుందని.. ఇది రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ప్రమాద ఘంటిక అని ఆందోళన వ్యక్తంచేశారు.