హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): జీవశాస్ర్తాలు, బయోఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్థలాలకు రోజరోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. అభివృద్ధి వేగం పెరగటం, కంపెనీల విస్తరణతో రానున్న రోజుల్లో 20 లక్షల చదరపు అడుగుల స్థలం అదనంగా తోడవుతుందని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మంగళవారం జీనోమ్వ్యాలీలో రూ.1,100 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులను ప్రారంభించారు. టీ-హబ్ తరహాలో ఏర్పాటుచేయనున్న ప్రతిష్ఠాత్మక బయోఫార్మా హబ్ (బీ-హబ్)కు శంకుస్థాపన చేశారు. జీవీ-1 అనే మరో కొత్త ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ఇప్పటికే కొనసాగుతున్న ఇన్నోపోలిస్, టచ్స్టోన్, ఏఆర్ఎక్స్లకు చెందిన రెండో దశ కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి ఆర్ అండ్డీ క్లస్టర్ జీనోమ్ వ్యాలీనేనని పేర్కొన్నారు. ‘జీనోమ్ వ్యాలీలో మరో మైలురాయి పడింది. ఇక్కడ ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ విస్తరణ హర్షణీయం. 800లకుపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు తెలంగాణ నేడు చిరునామా. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో మన రాష్ట్రం, ఇక్కడి లైఫ్ సైన్సెస్ సంస్థలు ప్రధాన పాత్ర
పోషిస్తున్నాయి’ అని తెలిపారు.
ఒకేచోట 200 కంపెనీలు
జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం సుమారు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200లకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఏర్పాటయ్యాయని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాంతం అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా అవతరించిందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదిగిందని వివరించారు. ‘తాజా ప్రాజెక్టులతో జీనోమ్ వ్యాలీ లో మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తాయి. 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలో ఎక్కడా లేనంతగా ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం జీనోమ్ వ్యాలీలో ఉన్నది. దీనిని ఇంకా విస్తరిస్తున్నాం. ఇక్కడ సీఆర్ఓలు, సీడీఎంఓలు ఉన్నాయి. సింజీన్, లారస్, క్యూరి యా తదితర అనేక సీఆర్ఓలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రానున్నాయి’ అని తెలిపారు.
భారీగా పెట్టుబడులు
వ్యాక్సిన్ల అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్-19 సమయంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయటంలో తెలంగాణ కీలకపాత్ర పోషించిందని చెప్పారు. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బయోలాజికల్-ఈ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్తోసహా పలు కంపెనీలు రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయని వెల్లడించారు. స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు చెందిన ఫార్మా కంపెనీ హెటిరో 750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిందని, ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ రోచె తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. జీనోమ్ వ్యాలీలో డిమాండ్, కంపెనీల రాకను బట్టి తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం 2030 లక్ష్యానికి ముందుగానే 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆర్అండ్డీ, బయో ప్రాసెస్ ఫెసిలిటీస్, కొలాబరేషన్ మాడ్యూల్స్, గ్రేడ్-ఏ ట్రైనింగ్ రూమ్ సౌకర్యాలు పుష్కలంగా ఉన్న బీ-హబ్, బయోఫార్మా కంపెనీలకు మంచి వేదికగా మారుతుందన్నారు. పిరమిల్-యాపన్ బయోలైఫ్ సైన్సెస్లో 8 మిలియన్ల డాలర్లతో కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించటం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ పెట్టుబడులు బయోఫార్మా రంగంలో తెలంగాణ నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు.
జీనోమ్వ్యాలీలో ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ సంస్థ నూతన యూనిట్కు మంగళవారం భూమిపూజ చేస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
బీ-హబ్తో కొత్త పుంతలు
లైఫ్ సైన్సెస్ మౌలిక వసతుల కల్పనలో తెలంగాణకు దేశంలో ఏ రాష్ట్రమూ సాటిరాదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ ఇప్పటికే అతిపెద్ద ల్యాబ్స్పేస్కు కేంద్రంగా ఉన్నదని, 30 లక్షల చదరపు అడుగుల అంతర్జాతీయ ప్రమాణాల వర్క్స్పేస్ అందుబాటు లో ఉన్నదన్నారు. అమెరికా సంస్థ జీవీ రిసెర్చ్, విమ్టా ల్యాబ్స్ అత్యాధునిక సౌకర్యాలతో కంపెనీలు ప్రారంభిస్తున్నాయని చెప్పారు. బయోఫార్మా హబ్ ఈ రంగంలో గొప్ప మలుపు అని పేర్కొన్నారు. 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ కేంద్రం బయోటెక్నాలజీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారనున్నదని చెప్పారు. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ ఇప్పటికే 900 కోట్లతో 25 లక్షల చదరపు అడుగుల ప్రయోగశాలను ప్రారంభించిందని, వచ్చే ఐదేండ్లలో మరో రెండు వేలకోట్ల పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టనున్నదని కేటీఆర్ వివరించారు.
ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ దూకుడు
ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ జీనోమ్ వ్యాలీలో మరో 9 లక్షల చదరపు అడుగుల ల్యాబ్ స్పేస్లను ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ప్రాజెక్టులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. వీటిలో ఇన్నోపోలిస్, జీనోపోలిస్, టచ్స్టోన్, ఏఆర్ఎక్స్, నెక్సోపోలిస్, జీవీ-1, బీ-హబ్ ఉన్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలు కీలకపాత్ర పోషించాయని ఈ సందర్భంగా ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ ఎండీ విశాల్ గోయల్ అన్నారు. డ్రగ్ డిస్కవరీసహా లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వృద్ధికి తోడ్పడాలనే ల్యాబ్ స్పేస్లను ఆర్ఎక్స్ ప్రొపెల్లంట్ గణనీయంగా పెంచుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా దేశం లో సమగ్ర పరిశోధనా వ్యవ స్థ బలోపేతానికి కృషి చేస్తున్నది. ‘రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే లైఫ్ సైన్సెస్ కంపెనీలకు అవసరమైన టర్న్కీ ఆర్ అండ్ డీ ల్యాబొరేటరీలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, వేర్హౌసింగ్ పార్కులను ప్లగ్ అండ్ ప్లే విధానంలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తున్నది’ అని తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్-ఫార్మా డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ తెలిపారు.