హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తె లంగాణ): బీఆర్ఎస్ సభల సమ్మోహనం అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఎన్నికల ప్రచార ముగింపు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు జనంతో పోటెత్తుతున్నాయి. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు రోడ్షోలు జన ఉప్పెనను తలపిస్తున్నాయి. వాటితోపాటు ఎక్కడికక్కడ అభ్యర్థుల ప్రచార సభలకు అన్నివర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. సీఎం కేసీఆర్ గురువారం నాటికి 82 సభలతో ప్రజలను నేరుగా కలుసుకొని ఆమోదం పొందారు. సభల్లో ఉద్యమకాలం నుంచి స్వరాష్ట్ర సాధన, అనంతర బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన ప్రగతి ప్రస్థానాన్ని కండ్లకు కడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆధార సహితంగా కేసీఆర్ వివరిస్తున్న తీరు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. కాంగ్రెస్ గత, వర్తమాన చరిత్రను కండ్లకు కడుతూ చేస్తున్న భవిష్యత్తు దర్శనం ప్రజల్లో స్పష్టతనిస్తున్నది.
కేసీఆర్కు ప్రత్యామ్నాయ నాయకత్వం కరువు
సభలకు హాజరైన ప్రతీ ఒక్కరు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రత్యామ్నా యం లేదనే నిశ్చితాభిప్రాయానికి వస్తున్నారు. తెలంగాణను కేసీఆర్ కన్నా మిన్నగా ప్రేమిం చి, ఆరాధించే నాయకుడు మరొకరు కనిపించడం లేదని బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలు తేటతెల్లం చేస్తున్నాయి. నాడు ఉద్యమంలో అయినా, నేడు ప్రభుత్వంలో ఉన్నా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి మరో పార్టీకి లేదని నిరూపితమైంది. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని సాధికారికంగా చెప్పగలిగే సత్తా ఒక్క బీఆర్ఎస్కే మినహా మరో పార్టీకి లేదని ప్రజ లు స్థిర అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. కేసీఆర్ ప్రసంగాల సందర్భంగా జనం నుంచి వ్యక్తమవుతున్న స్పందనే అందుకు నిదర్శమని విమర్శకులూ కాదనలేకపోతున్నారు.
సంక్షేమం చేరని ఇల్లు లేదు: వీ ప్రకాశ్
కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఎలా కదనగలమని పేర్కొంటుండటం ప్రజాఆశీర్వాద సభల ప్రత్యేకతగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. బలవంతంగా వచ్చిన వారైనా కేసీఆర్ ప్రసంగాల్లో చెప్పే విషయం అవునా, కాదా అని అంచనావేసే వివేచన తెలంగాణ సమాజంలో ప్రబలంగా ఉన్నది.. అని ఆయన విశ్లేషించారు. తెలంగాణలో హనుమంతుడి గుడిలేని ఊరులేదు. కేసీఆర్ సంక్షేమ పథకాలు చే రని ఇల్లు లేదు’ అనే నానుడి స్థిరపడి పోయిందని తేల్చిచెప్పారు. కొన్ని ప్రేరేపిత శక్తులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు కేసీఆర్ పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. దీంతో ప్రజాఆశీర్వాద సభలకు యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని తెలిపారు.
స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం
గత నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 82 సభలు జనసంద్రాన్నే తలపించాయి. ఈ సభలకు వచ్చిన వారు స్థిరమైన అభిప్రాయంతో తిరిగి వెళ్తున్నారు. స్థిరమైన ప్రభుత్వాన్ని, ధృఢమైన నాయకత్వాన్ని తామెందుకు జారవిడుచుకుంటామని నిర్ణయించుకుంటున్నారు. ఇదే విషయాన్ని బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే..
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ఉన్న గులాబీ సైన్యంలో పట్టుదల కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. తమ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం అన్ని స్థాయిల గులాబీ శ్రేణులు ఇల్లిల్లూ తిరుగుతూ మనిషి మనిషిని కలుస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని కండ్లకు కడుతూ ప్రజా మద్దతును కూడగట్టడంలో బీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా పనిచేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ తామే అభ్యర్థి అన్న రీతిలో గులాబీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ విషప్రచారాన్ని ఎక్కడికక్కడ గులాబీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి.