నిజామాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్న సిరిసిల్ల, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణే గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను గెలవాలని కాంగ్రెస్, బీజేపీ ఆరాటపడుతున్నాయని, కానీ, తెలంగాణే గెలవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. మంగళవారం కామారెడ్డి, సిరిసిల్లలో నిర్వహించిన రోడ్షోల్లో కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్లలోని తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘తెగించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణను బాగుచేసుకునే బాధ్యతను ప్రజలు మాకు అప్పజెప్పారు. మెదళ్లను కరిగించి, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నం. దశాబ్దాల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు తొలగిపోయి ప్రజలు కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయే రోజులు తీసుకురావాలని ప్రేమతో పరిపాలన సాగించాం’ అని తెలిపారు. ఇటు పక్క సర్వసమర్థుడు, దమ్మున్నవాడు. దార్శనికుడు సీఎం అభ్యర్థిగా ఉన్నారని.. అటు పక్క జోకర్లు, బ్రోకర్లు, బపూన్లు ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
70 ఏండ్ల చరిత్రలో తెలంగాణ ఎన్నో పార్టీలను గెలిపించింది. కానీ, తెలంగాణను గెలిపించిన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే!
– మంత్రి కేటీఆర్
కర్ణాటక డబ్బు సంచులతో తెలంగాణలో ఓట్ల వేట కొచ్చారని కాంగ్రెస్పై కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ను దేశమంతా విస్తరింపజేస్తున్నారన్న కుట్రతో కేసీఆర్ గొంతునొక్కేందుకు రాహుల్గాంధీ, మోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేరని తేల్చి చెప్పారు. తెలంగాణను కాంగ్రెస్ 50 ఏండ్లు ఏడిపించిందని, రాచిరంపాన పెట్టి, మన రక్తం తాగిందని ఫైరయ్యారు. కాంగ్రెసోళ్ల సీటుకే గ్యారెంటీ లేదని, వాళ్లిచ్చే గ్యారెంటీలకు దిక్కుంటదా? అని ప్రశ్నించారు. ‘మూడు గంటల కరెంటు ఇస్తం. 10హెచ్పీ మోటర్లు పెట్టుకోండి. కౌలు రైతుకు పైసలిస్తే అసలు రైతుకు ఇవ్వం అని కాంగ్రెస్ అంటున్నది. ధరణి పోర్టల్ ఎత్తేస్తమంటూ ఓపెన్గా చెప్తున్నది. తెలిసి తెలిసి బొందలో పడదామా? ప్రజలు ఆలోచించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
‘స్వరాష్ట్రంలో పాలమూరు వలసలు ఆగాయా? లేదా? పక్క రాష్ర్టాల కూలీలు వచ్చి మన పొలాల్లో నాట్లు వేస్తున్నారా? లేదా? నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ దిగిపోయిందా? లేదా? విషం నీళ్ల పీడ విరగడై స్వచ్ఛమైన భగీరథ జలాలతో గొంతులు తడుస్తున్నాయా? లేదా? నేతన్నల ఆత్మహత్యల ఉరిసిల్లను సిరిసిల్లగా మారి విషాదం ఆగిందా? లేదా? మనం ఇచ్చిన కరెంటుతో పంటలు పండుతున్నది నిజం కాదా? ఎండిపోయిన చెరువులు నిండుకుండల్లా మారి మండుటెండల్లో మత్తుళ్లు దూకుతున్నయా? లేదా?దొంగరాత్రి మోటర్లు పెట్టబోయి పాములు కుట్టి, షాకులు కొట్టి రైతన్నలు సచ్చిపోయిన పాడు రోజులు మళ్లీ రావాలా?’ అని ప్రజలను కేటీఆర్ అడిగారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ను నం.1 చేశామని తెలిపారు. తెలంగాణ దుఃఖానికి సింబల్గా ఉన్న ప్రతి చిత్రం మారిందని వెల్లడించారు.
మాకంటే ఎక్కువగా తెలంగాణను ఎవరు ప్రేమించలేరు. మాకున్న ఆపేక్ష, ఆత్మీయత ఇంకే పార్టీకీ ఉండదు. తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం. విడదీయరాని అనుబంధం
– మంత్రి కేటీఆర్
ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్దే గెలుపు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని స్పష్టం చేశారు. ఈ రెండు రోజులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సోషల్ మీడియాలో మాయామశ్చీంద్రగాళ్ల న్యూస్లు, ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, టీఎస్టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
‘మీ బిడ్డగా తల ఎత్తుకుని గర్వపడేలా సిరిసిల్లను అభివృద్ధి చేశా. జిల్లాను చేయడమే కాకుండా మెడికల్ కళాశాల, వ్యవసాయ, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు తీసుకొచ్చా. సిరిసిల్లను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పెద్ద పెద్ద పరిశ్రమలను తెప్పించాలన్నది నా లక్ష్యం’ అని సిరిసిల్ల రోడ్షోలో మంత్రి కేటీఆర్ అన్నారు. మధ్యమానేరులో దేశంలోనే అతిపెద్ద ఆక్వాహబ్ను, వర్కర్ టు ఓనర్ పథకం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. తిరుపూరుతో పోటీపడేలా ఇక్కడి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కావాలని, ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. వందేండ్లు చెప్పుకునేలా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల, కామారెడ్డి రహదారిని నాలుగు వరసలుగా మారుస్తానని చెప్పారు. ఐటీ రంగాన్ని తప్పకుండా తీసుకువస్తానని, త్వరలోనే రైలు కూత వినిపిస్తానని అన్నారు. ‘సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్ల అయ్యే మార్పు కావాలా? నేతన్నలు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే మార్పు కావాలా? రైతులకు 24 గంటలు పోయి 3 గంటల కరెంటు వచ్చే మార్పు కావాలా? రైతుబంధు రద్దయ్యే మార్పు కావాలా? ఏ మార్పు కావాలో ఆలోచించాలి’ అని ప్రజలను కోరారు.
తెలంగాణలో ఎక్కడ ఏ వాగు ఉన్నదో, ఏ వంక, డొంక ఎక్కడున్నదో సమగ్రంగా తెలిసిన నాయకుడు కేసీఆర్. సాధించింది చాలా ఉన్నది. సాధించాల్సింది ఇంకా ఉన్నది
– మంత్రి కేటీఆర్
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు కామారెడ్డి నియోజకవర్గం పరిస్థితి కూడా అదే విధంగా ఉండబోతున్నదని కామారెడ్డి రోడ్షోలో కేటీఆర్ అన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వచ్చారంటే ఏమొస్తుందో ప్రజలంతా ఆలోచన చేయాలని కోరారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలను ఏడాది లోపు తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్ వచ్చాక కామారెడ్డికా తక్దీర్ బదల్ జాత. 55 ఏండ్లు ఒకెత్తు. ఈ ఐదేండ్లు ఒకెత్తు. కామారెడ్డి అభివృద్ధికి నేను బాధ్యత తీసుకుంటా’ అని తెలిపారు. కామారెడ్డిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలంటే బీఆర్ఎస్తోనే అవుతుందని వెల్లడించారు. ప్రతి వార్డులో ఒక మహిళా సమాఖ్య భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. వారంకోసారి కామారెడ్డికి తప్పకుండా వస్తానని చెప్పారు. 30న ఎన్నికల్లో దమ్ము చూపాలె.. దుమ్ము రేపాలె.. అఖండ మెజార్టీతో కేసీఆర్ను గెలిపియ్యాలె అంటూ పిడికిలి బిగించి ప్రజలతో జై కొట్టించారు. బీజేపోడికి బుడ్డా పైసా తెచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. మతం పేరిట బీజేపోడు రాజకీయం చేస్తుంటే, కాంగ్రెసోడు కులం పేరిట రాజకీయం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
పడావుపడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ప్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకట్లతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడెట్లున్నదో ప్రజలకు తెలుసు
– మంత్రి కేటీఆర్