పెద్దపల్లి, జూలై 29(నమస్తే తెలంగాణ) : దళితులు సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని సాధించాలనేసీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ దళిత బంధు దేశానికే ఆదర్శమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత బందు పథకం లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ, అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా పాల్గొని 233 మందికి రూ. 21.85 కోట్ల విలువైన యూనిట్లను అందజేశారు. అదే విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద రూ. 26.50లక్షలతో 53 మందికి ఒక్కొక్కరికి రూ. 50వేల విలువైన కుట్టుమిషన్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా కొలువు దీరినా ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం తీసుకువచ్చిన పథకం మచ్చుకైనా ఉందా..? అని ప్రశ్నించారు. కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా దళితులకోం వారు ఏం చేశారో ప్రజలకు వివరించాలన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో నీళ్లు లేక, కరెంటు లేక, ఉద్యోగాలు, ఉపాధి లేక అన్నమోరామచంద్ర అని అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఏం చేయాలో కేంద్రం యోచించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.