సర్దార్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై అధ్యయనం
హైదరాబాద్, ఫిబ్రవరి10 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో (పీఠంతో కలుపుకుని 175) హుసేన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. విగ్రహ రూపకల్పనకు సంబంధించి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండురోజులుగా ఇతర రాష్ర్టాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ పరిసరాలలో ఉన్న పలు విగ్రహాల స్టూడియోలను సందర్శించిన ఆయన, గురువారం గుజరాత్లో పర్యటించారు. నర్మదా లోయలోని కేవడియాలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని సందర్శించారు. పటేల్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, ప్రదర్శనశాల, లేజర్షోలను తిలకించారు. అక్కడి అధికారులను అడిగి విగ్రహ ప్రతిష్టాపన విశేషాలను మంత్రి తెలుసుకున్నారు. మంత్రి వెంట అధికారుల బృందం పర్యటిస్తున్నది.