ధర్మపురి : ముస్లింల సంక్షేమంపై ప్రత్యేక దష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు. రంజాన్(Ramzan) పండుగ సందర్భంగా ప్రభుత్వ పక్షాన ఇచ్చే ఇఫ్తార్(Iftar) విందు ఏర్పాట్లపై నియోజకవర్గ ముస్లిం నాయకులతో శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం(Muslims)లు నెల రోజుల పాటు ఎంతో దీక్ష, భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేయడం అభినందనీయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. రంజాన్ పండుగకు పేదలకు దుస్తుల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. కేసీఆర్(KCR) నేతృత్వంలో గడిచిన 9 ఏళ్ల కాలంలో ఈద్గాలు(Edga), మసీదుల అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఉపవాస దీక్షలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా ప్రత్యేక వెసులుబాటు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
ఉపవాస దీక్షలు భక్తి శ్రద్దలతో నిర్వహించుకొని మత సామరస్యాన్ని ప్రతిభింబించేలా రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు అమ్జాద్, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్ యూనుస్, కోఆప్షన్ సభ్యులు అలీమ్, షబ్బీర్, మండల కోఆప్షన్ సభ్యులు కైసర్, అబ్దుల్ రహమాన్, ఎండి రియాజ్, జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ సభ్యుడు ఆసిఫ్, ఏఎంసీ డైరెక్టర్ ఎండి ఇక్రామ్ తదితరులున్నారు.