పల్లె ప్రగతితోనే రాష్ర్టానికి అవార్డులు
ధరణిని తీసేద్దామన్న రేవంత్కు సిగ్గుండాలి
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కొడిమ్యాల, మే 10 : పల్లె ప్రగతితోనే రాష్ర్టానికి అవార్డులు వచ్చాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్కు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీ కరణ్ జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలతను మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.
ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, మంకీఫుడ్ కోర్టులు, పారిశుద్ధ్య పనులు వంద శాతం పూర్తి చేయడం వల్ల ఈ అవార్డు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా పల్లె ప్రగతి కార్యక్రమం లేదని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి అవార్డులు ఇవ్వడం ఇష్టం లేకపోయినా గ్రామ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలకు గుర్తుగా ఆ అవార్డులు వచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు పచ్చి అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుతున్నారని, రాష్ట్ర అభివృద్ధికి రూపాయి కూడా తీసుకురాని ఎంపీలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజల కోసం ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనూ 2 వేల పింఛన్ ఇస్తలేరన్నారు.
రేవంత్పై కొప్పుల ఫైర్..
తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడటంపై మంత్రి కొప్పుల నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు ధరణి ద్వారా 1.70 కోట్ల ఎకరాల భూములకు 1.60 కోట్ల పాస్ పుస్తకాలు ఇచ్చినట్టు చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో భూ సమస్యలపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాసిల్దార్ స్థాయి అధికారిని చంపిన చరిత్ర ఆ పార్టీకి ఉన్నదని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టిన చరిత్ర బీజేపీ వాళ్లదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ రవి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.