జగిత్యాల : ఎన్నో ఏండ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న సమీకృత మార్కెట్ ను నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.4 కోట్లతో సమీకృత మార్కెట్, 13 లక్షలతో బస్తీ దవాఖాన, 25 లక్షలతో పశువైద్య దవాఖాన కు శంకుస్థాపన, రెండు కోట్లతో సబ్ స్టేషన్, 25 లక్షలతో పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణం, మాజీ ప్రధాని పీవీ, స్వాతంత్ర సమరయోధులుకేవీ కేశవులు, సంగనబట్ల మాణిక్య శాస్త్రి విగ్రహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధర్మపురి పట్టణంలో ఎన్నో సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ధర్మపురి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మరకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే జరుగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ బాషా, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సౌళ్ల భీమయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందరపు రామన్న, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్, జిల్లా కౌన్సిలర్ పాల్గొన్నారు.