దళితబంధు యజ్ఞంలా ముందుకు..
సమీక్షలో అధికారులకు కొప్పుల పిలుపు
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ పథకం అద్భుతమైనదని, దీన్ని యజ్ఞంలా ముందుకు తీసుకుపోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. సోమవారం దళితబంధు పథకం పురోగతిపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు పథకం కింద ఇప్పటివరకు 24,046 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని, 36,405 మంది ఖాతాల్లో నిధులు జమయ్యాయని వెల్లడించారు.
హూజూరాబాద్లో 11,647, వాసాలమర్రిలో 71, చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో 6,685, అన్ని జిల్లాల్లో 8,507 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొనేలా మరింత అవగాహన కల్పించాలని, అందుకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రాహూల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.