కరీంనగర్ : జిల్లాలోని వెల్గటూర్ మండలం కరీంనగర్-రాయపట్నం రాష్ట్ర రహదారి సమీపంలో 30 అడుగుల బుద్ధవిగ్రహం, 25 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం స్థల పరిశీలన జరిపారు. పాశిగామ బౌద్ధ స్తూపం స్థానంలో వీటి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ మేరకు ఢిల్లీలో ఈ విగ్రహాల తయారీ పూర్తయినట్లు ఆయన తెలిపారు.
ఈ విగ్రహాల ఏర్పాటు చేసేందుకు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న బౌద్ధ స్తూపం ఉన్న స్థలాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుతోపాటు ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి సమీక్షించారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇక్కడ లభ్యమైన అవశేషాలతో ఇక్కడే పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేసి ధ్యాన మందిరం, ఇతర బౌద్ధ ప్రాధాన్యత ఉన్న నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు మంత్రిని కోరారు. ధర్మపురి, గూడెం గుట్ట, కోటిలింగాల ప్రాంతాల మధ్యలో ఉన్న ఈ చారిత్రక ప్రాంతంలో అభివృద్ధి చర్యలు చేపడితే పర్యాటక హబ్ లాగా ఏర్పడుతుందని కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.