జగిత్యాల, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ చెత్త పాలనతో దేశంలో తిండి గింజల కొరత ఏర్పడిందని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఆధునీకరించిన రోళ్లవాగు ప్రాజెక్ట్ను ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీర్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వానికి కన్నుకుట్టిందని ఆరోపించారు. తెలంగాణపై కత్తికట్టిన కేంద్రం ఇక్కడి ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని దెబ్బతీసేందుకు ధాన్యం కొనుగోలు చేయకుం డా కుట్ర చేసిందని అన్నారు. రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ ధైర్యం చేసి రూ.22 వేల కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ధాన్యం ఉత్పత్తి విషయంలో బీజేపీ చేసిన తప్పిదం వల్ల దేశంలో తిండి గింజలకు కొరత ఏర్పడిందన్నారు.