హైదరాబాద్ : ప్రపంచ మానవాళికి గౌతమ బుద్ధుడి బోధనలు అనుసరణీయమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం వద్ద కాకినాడకు చెందిన ప్రముఖ బౌద్ధ భిక్షువు బంతే ధామ్నా ధజథేరో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్, పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బుద్ధుడు అహింస, శాంతి, దయ, కరుణ, ప్రేమ, సోదర భావం, సమానత్వాన్ని బోధించాడని, ఆ బోధనలు కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేశాయని, ఇంకా చేస్తూనే ఉన్నాయన్నారు.
భారత ఉపఖండం, జపాన్, చైనా, మంగోలియా, కాంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాల ప్రజలను బాగా ప్రభావితం చేశాయన్నారు. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలకు చెందిన వారిని, మైనారిటీలను సమదృష్టితో చూడడంతో పాటు గౌరవిస్తున్నారన్నారు. ప్రజలందరి భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. లౌకిక భావాలను ముందుకు తీసుకెళ్తున్నారని, అందరూ ఎలాంటి అభద్రతా భావానికి లోనవకుండా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, బౌద్ధ భిక్షువు ధజథేరో, సమతా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.