జగిత్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేశ ప్రధానిగా మోదీ ప్రజలకు చేసిన మంచికంటే వారిని ముంచిందే ఎక్కువని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు అన్ని అంశాల్లో మోదీ అన్యాయమే చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై విషం కక్కే ప్రధానికి ఇక్కడి అభివృద్ధిపై మాట్లాడే నైతికత లేదని మండిపడ్డారు. దేహ సౌందర్యంపై కాకుండా దేశ సౌభాగ్యంపై ప్రధాని దృష్టి సారించాలని హితవుపలికారు. సోమవారం మంత్రి కొప్పుల జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మోదీ తెలంగాణకు నష్టం కలిగిస్తూనే ఉన్నారని చెప్పారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపి తొలి ద్రోహం చేశారని గుర్తుచేశారు.
కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు కర్మాగారం, ఒక నవోదయ పాఠశాల, సైనిక్ సూల్ను కూడా ఇంతవరకు మంజూరు చేయలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 154 మెడికల్ కాలేజీలను మంజూరుచేసిన మోదీ.. తెలంగాణకు ఒకటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును సైతం రద్దుచేసిన వ్యక్తి మోదీని అని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఇంతవరకు దానిపై ప్రధాని ఎందుకు ఊసెత్తడం లేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగిత శాతం 8 నుంచి 21కి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ.. ఈ ఎనిమిదేండ్లలో ఎన్ని ఉద్యోగాలను కల్పించారని నిలదీశారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని, డబుల్ ఇంజిన్ పాలన రాష్ర్టాల్లో కూడా తెలంగాణ తరహా పథకాలు అమలు కావడం లేదని అన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హా రాక సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి సంధించిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. భారత్ మాతాకీ జై.. జై శ్రీరామ్ నినాదాలు ఒక్క బీజేపీకి చెందినవి కావని, ఇవి సార్వజనీయమైనవని సూచించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి, జడ్పీ, మున్సిపల్ వైస్ చైర్మన్లు వొద్దినేని హరి చరణ్రావు, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.