కరీంనగర్: నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు (Dalitha bandhu) పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. కరీంనగర్లోని ఇండోర్ స్టేడియం వద్ద మంత్రి గంగుల కమలాకర్తో కలిసి లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పథకంతో దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు.
దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు స్వయంఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. యూనిట్లను అందుకున్న తర్వాత దళితుల కుటుంబాల్లో ఆనందం కనబడిందని, దీంతో తమకు కూడా సంతోషం కలిగిందన్నారు. నేడు 146 మంది లబ్ధిదారులకు 63 యూనిట్లుగా రూ.15,30,84,413 విలువ చేసే వాహనాలను అందించామన్నారు.
దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్రం మొత్తం దళితబంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా అందుకున్న యూనిట్లను సక్రమంగా నడిపించుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.