Koppula Eshwar | ధర్మపురి : మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మహిళల అభివృద్ది, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించి దేశంలోనే తెలంగాణ మహిళలు ఆదర్శంగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు.
ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డీఆర్డీఓ ఆద్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మహిళా స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ ముఖ్య అథిగా హాజరై మాట్లాడారు. మహిళలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీలేని రుణాలు రూ.750 కోట్లు సీఎం కేసీఆర్ విడుదల చేశారన్నారు. ఇవి ఇప్పటికే మహిళల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగతావి వచ్చే జూన్, జూలై మాసాల్లో విడుదల చేస్తారన్నారు. వడ్డీలేని రుణాలతో మహిళలు ఆర్థిక ప్రయోజనం పొందుతారన్నారు. ప్రతీ మహిళ స్వశక్తితో ఎదిగేలా ఊతమివ్వడానికే వడ్డీలేని రుణాలు అందజేస్తునట్లు తెలిపారు. మహిళలు పొందిన రుణాలను అప్పులు కట్టుకోకుండా పెట్టుబడి కింద ఏదైనా యూనిట్ ప్రారంభించి జీవితంలో స్థిరపడాలన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ మహిళల అభివృద్ది, సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని జడ్పీ చైర్పర్సన్ దావా వసంత పేర్కొన్నారు. అలాగే వడ్డీలేని రుణాలను అందజేస్తూ ఆర్థికాభివృద్దికి తోడ్పాటునందిస్తున్నారన్నారు. ఒక మహిళ సంఘానికి ఒకప్పుడు రూ. 5 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుండి ఇప్పుడు రూ. 20 లక్షల వరకు రుణాలను తీసుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. మహిళలు వడ్డిలేని రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ది సాధించాలన్నారు.
సమాజంలో ఒక్కో కుటుంబానికి ఒక్కో నిర్వచనం ఉంటుందనీ, ప్రతీ నిర్వచనానికి మూలం మాత్రం ఆర్థిక శక్తి అని జిల్లా అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్ అన్నారు. ఆర్థిక శక్తి పరిపుష్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. సీఎం కేసీఆర్ అందించే వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ది సాధించాలన్నారు. మహిళా సంఘాల్లో తీసుకునేది అప్పు కాదని, రుణంగా భావించాలన్నారు. అప్పు అంటే ఖర్చు అని, రుణం అంటే పెట్టుబడిగా అడిషనల్ కలెక్టర్ నిర్వచించారు.
ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపెల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన మహిళా సంఘాలకు 2018-19 మరియు 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో మహిళలు తీసుకున్న రుణాలకు సంబందించి వడ్డీ రూ.7,08,10,954ల విలువ గలిగిన చెక్కులను మెప్మా ద్వారా 3,814 ఎస్హెచ్జీలకు మంత్రి ఈశ్వర్ అందజేశారు.