హైదరాబాద్: రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీల (Paper Leak) వెనుక బీజేపీ (BJP) నాయకుల హస్తం ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీల వ్యవహారమని విమర్శించారు. బలవంతంగా అధికారంలోకి రావాలని కమలం పార్టీ నేతలు మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం బీజేపీ ఎంత నీచానికైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉందని ఫైరయ్యారు. పదో తరగతి పేపర్ లీక్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. అధికార దాహంతో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
గతంలో జరిగిన టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ, ఇప్పుడు టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper Leak) ఉద్దేశపూర్వకంగానే జరిగాయన్నారు. పదో తరగతి పేపర్ను లీక్చేసిన ప్రశాంత్ (Prashanth) బీజేపీ కార్యకర్త అని, ఆయన బండి సంజయ్కి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ (Whatsapp) చేసినట్టు తేలిందన్నారు. ఈ విషయాన్ని బండి సంజయ్ దాచి ఉంచి, కుట్రకు సహకరించారని విమర్శించారు. కాబట్టి ఈ పేపర్ లీకేజీ ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని చెప్పారు. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించక పోగా.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆశతో లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్ విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. పదో తరగతి పరీక్షా పత్రం కాపీయింగ్ కేసులో బండి సంజయ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.