జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 9: విధి వెంటాడింది. ఆ కుటుంబాన్ని పగబట్టింది. కొన్నేండ్ల కింద తండ్రి, మూడేండ్ల కింద తల్లి మృతిచెందడంతో ఒంటరైన కొడుకును ఆదివారం మృత్యువు కబలించింది. జగిత్యాల టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం దీకొండకు చెందిన కాశపాక గంగాధర్(23) తల్లిదండ్రులు లేరు. 20 ఏళ్ల కింద తండ్రి జీవరత్నం, మూడేండ్ల కింద తల్లి నర్సవ్వ మృతిచెందింది. ఒంటరైన గంగాధర్ జగిత్యాలలోని ఓ దవాఖానలోని ల్యాబ్లో పనిచేస్తూ, అక్కడే ఓ రూంలో నివాసం ఉంటున్నాడు.
అయితే మనుమడైన గంగాధర్ను చూసేందుకు రాములపల్లి గ్రామానికి చెందిన తాత పోచయ్య ఆదివారం జగిత్యాలకు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత తాత, మనుమడు కలిసి భోజనం చేసేందుకు స్థానికంగా ఓ హోటల్కు వెళ్లారు. తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్డులో ఓ మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గంగాధర్కు తీవ్రగాయాలై మృతిచెందగా, పోచయ్యకు తీవ్రగాయాలయ్యాయి. దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గంగాధర్ పెద్దనాన్న వాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల టౌన్ పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందడం, ఉన్న ఒక్క కొడుకు సైతం చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.