గొల్లపల్లి, సెప్టెంబర్ 14: ‘రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ.. ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధి ఎజెండా లేదు. దొంగ మాటలతో గెలవాలని చూస్తున్నరు’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
గురువారం గొల్లపల్లి మండలం ఆత్మకూర్, దమ్మన్నపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలిపితే కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.