పెగడపల్లి, జనవరి 30: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎనిమిదేండ్లలో దేశానికి ఒరిగిందేమీ లేదని, దేశ ప్రజలకు ఆ పార్టీ చేసింది శూన్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సోమవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బంతికపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం, నంచర్లలో న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి సహకార సంఘం గోదాంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు అదృష్టవంతులని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కర్షకుడి ఇంట సంతోషం నిండిందని చెప్పారు. బీజేపీ నాయకులకు మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. కుట్టు శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించారు.