హైదరాబాద్ : మైనారిటీ సంక్షేమశాఖలో ఖాళీల భర్తీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. రాష్ట్రంలో 81వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిలో మైనారిటీ సంక్షేమ శాఖలో 76, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 1445 ఖాళీలు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖలో గ్రూపు -1 కేటగిరిలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి 6, గ్రూపు -2 కేటగిరిలో 10 సహాయ సంక్షేమాధికారి, హౌస్ సంక్షేమాధికారి 15, జూనియర్ అసిస్టెంట్లు 28, అకౌంటెంట్లు 4, ఉర్దూ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
అదేవిధంగా మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 1,445 పోస్టులు ఖాళీలు ఉండగా, వీటిలో 594 టీజీటీ, 414జూనియర్ లెక్చరర్లు, 200 లైబ్రేరియన్లు, 127స్టాఫ్ నర్సులు, 60 ఫిజికల్ డైరెక్టర్లు, 38 క్రాఫ్ట్ టీచర్లు, 12 పీఈటీలు ఖాళీలు ఉన్నట్లు మంత్రి కొప్పులకు అధికారులు వివరించారు. గురుకుల పోస్టులను తెలంగాణ గురుకుల విద్యామండలి (TREIB ) ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో పోటీ పరీక్షలకు యువతను సంసిద్ధం చేసేందుకు మైనారిటీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆయా విషయాల్లో నిపుణులతో ఉచితంగా కోచింగ్ ఇప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.