హైదరాబాద్ : ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అసలుసిసలైన చిరునామా తెలంగాణ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని, ప్రజలందరి సంక్షేమానికి, సముద్ధరణకు, అన్ని రంగాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో పాటుపడుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో నరాల బలహీనత, వెన్నుపూస గాయంతో బాధపడుతున్న 71 మందికి బ్యాటరీ వీల్ చైర్స్ అందజేశారు. చాదర్ఘాట్ వద్ద ఉన్న విక్టరీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై కేసీఆర్ సానుకూల దృక్పథంతో ఉన్నారని, వీరి సంక్షేమానికి, ఉన్నతికి దేశంలో మరెక్కడా కూడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమానికి గతంలో ఏటా రూ.5కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ను మరింత పెంచుకుంటూ పోతున్నారన్నారు. గతంలో నెలకు రూ.500 పింఛను ఇవ్వగా, ఇప్పుడు సుమారు 5లక్షల మందికి రూ.3,016 చొప్పున పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం ఏటా రూ.1800కోట్ల ఖర్చవుతున్నదని కొప్పుల చెప్పారు.
ఆరోగ్య పరిరక్షణకు ప్రతి నెల మెడికల్ కిట్ ఇవ్వాలనే డిమాండ్ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సానుకూలంగా పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాలలో మంచి కార్యక్రమాలు ఉంటే అధికారులతో కలిసి పరిశీలించి తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థయిర్యం, గౌరవంతో ముందుకు సాగేలా కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అంతకు ముందు సంస్థ ఆవరణలో మంత్రి, చైర్మన్ దివ్యాంగులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో దివ్యాంగుల అడ్వయిజరీ బోర్డు సభ్యుడు నారా నాగేశ్వరరావు, సంస్థ జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.