హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న ఎస్సీల అభివృద్ధికి తమ ప్రభుత్వం 23 శాతం నిధులను కేటయించిందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనమండలిలో ప్రకటించారు. జనాభా శాతం కంటే అధికంగా నిధులివ్వటమే ఎస్సీ కులాల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడించారు. మండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో నిరుపేద వర్గాల సంక్షేమం – సాధించిన విజయాలు’పై స్వల్పకాలిక చర్చలో కొప్పుల ఈశ్వర్ సహా మంత్రులు సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్ మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, మీర్జా రహమత్బేగ్, ఎల్ రమణ, తాటిపర్తి జీవన్రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వాణీదేవి, బస్వరాజు సారయ్య తదితరులు ప్రసంగించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. అందరికి ఒకేసారి దళితబంధు ఇవ్వాలన్న వాదన అసంబద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయని, వీరందరికి ఒకేసారి ఇవ్వటం సాధ్యపడుతుందా? అని ప్రశ్నించారు. ఏడేండ్లు ఓపిక పడితే 17 లక్షల కుటుంబాలకు దళితబంధు అందుతుందని వివరించారు. మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, మక్కామసీదు మరమ్మతులకు రూ.40 కోట్లు, అనీసుల్ గుర్బా నిర్మాణానికి రూ.39 కోట్లు, పహడీషరీఫ్ దర్గాకు రూ.15 కోట్లు కేటాయించామని వెల్లడించారు. అజ్మీర్లో రుబాత్ నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించామని, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్ను ఇవ్వాలన్న నిర్ణయంపై సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎల్ రమణ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ బలపరిచారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో సంపదను పెంచి, ప్రజలకు రూపాయి విదల్చని ప్రభుత్వాలను చూశానని, కానీ సంపదను పెంచి, ప్రజలకు పంచుతున్నది కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు.
మూడేండ్లు దాటిన చిన్నారుల తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం పిల్లలను ప్రీ-స్కూళ్లకు పంపిస్తున్నారని, రాష్ట్రంలోను ప్రీ-స్కూల్ విద్యను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. అందుకోసం పుస్తకాలను రూపొందించామని, బోధనకు వీలుగా అదనంగా ఒక టీచర్ను నియమిస్తామని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా తొలి మోటర్ వెహికల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులందరికీ అధిక పోషకాలు గల బాలామృతం ప్లస్ను అందజేయనున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దత్తత హెల్ప్లైన్ను ప్రారంభించామని వివరించారు. అనాథలకు 21 -24 ఏండ్లు వచ్చి, వారు కుటుంబంగా స్థిరపడే వరకు ప్రభుత్వమే అమ్మానాన్నై అన్ని చూసుకుంటుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా పాలసీని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
తొమ్మిదేండ్లలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని, బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ కులవృత్తిదారులకు అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియ అని ప్రకటించారు. ఇది దళితబంధు తరహాలో బీసీ బంధు కాదని, కుల వృత్తులను ఆదుకునేందుకు చేపట్టిన పథకం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ పథకం కోసం 5.25 లక్షల దరఖాస్తులు కాగా, పరిశీలనలో 4.11 లక్షల అర్హులుగా తేలారని, చివరి లబ్ధిదారు వరకు సహాయాన్ని అందిస్తామని వివరించారు. ఈ పథకానికి రూ.400 కోట్లు విడుదల అయ్యాయని, నెలకు కొంత మందికి చొప్పున చెక్కులు ఇస్తామని, శనివారం నుంచే చెక్కుల పంపిణీని ప్రారంభిస్తామని వెల్లడించారు. కేసీఆర్ విద్యాకానుక పథకం మార్గదర్శకాలను త్వరలోనే ప్రకటించి ఐఐటీలు సహా దేశంలోని 200 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన వారి చదువులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై శాసనమండలి వేదికగా అబద్ధాలు మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ఫీజు బకాయిలు ఉండటంతో కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని జీవన్రెడ్డి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలను పల్లా తిప్పికొట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ఆలిండియా ఇంజినీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉండి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మంజూ రు చేయాలని సుప్రీంకోర్టులో పోరాటం చేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బకాయిలను మొత్తం విడుదల చేసిందని, సత్యదూరమైన మాటలు మాట్లాడటం తగని హితవు పలికారు.