Minister Koppula Eshwar | హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిర్మాణం పనులను తుది చేరాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ట్యాంక్బండ్ సమీపంలో 11.5 ఎకరాల్లో నిర్మితమవుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిశీలించారు. ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులు 90శాతం పూర్తి చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. విగ్రహం చుట్టూ ఎలివేషన్, స్మృతివనం, సెంట్రల్ లైబ్రరీ, ఫౌంటెన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మార్చి చివరి నాటికి నిర్మాణం పనులు పూర్తి అవుతాయని చెప్పారు.
విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణం చేస్తున్నామని, విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతోపాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 125 అడుగుల ఎత్తు, 45.5 ఫిట్ల వెడెల్పుతో విగ్రహం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని మాటల్లో కాదు చేతల్లో తమ ప్రభుత్వం చూపుతుందని కొప్పుల పేర్కొన్నారు.
ఈ ప్రాంతం సుందరంగా తీర్చి దిద్దే విధంగా అంబేద్కర్ విగ్రహ పనులు సాగుతున్నాయని,
ఏప్రిల్లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు.