Minister Koppula Eshwar | కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో ‘మన ఊరు – మనబడి’లో భాగంగా రూ.52.67లక్షల నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అలాగే గ్రామంలో రూ.77లక్షలతో గంగదేవిపల్లి నుంచి మొగుల్ల చెరువు వరకు వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోరంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకువచ్చిందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుతో ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమం మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.