గొల్లపల్లి, సెప్టెంబర్ 5 : తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్ కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజలు ఏమీ అడుగకుండానే వారి అవసరాలు తెలుసుకుని సంక్షేమ ఫలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్, బొంకూర్, అబ్బాపూర్ గ్రామాల్లో మంగళవారం ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బతుకమ్మలు, డీజే చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ‘మళ్లీ విజయం మీదే’ అంటూ మహిళలు వీరతిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన కేసీఆర్ రైతుల ఆర్థికాభివృద్ధి కోసం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని అన్నా. అంతేగాక ప్రాజెక్టుల నిర్మాణంతో మూడు పంటలకు సరిపడా సాగునీటి అవసరాలను తీర్చినట్టు చెప్పారు. గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నది ఒక్క తెలంగాణ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగులకు అడగకుండానే రూ.4 వేల పింఛన్, ఒంటరి, గీత, నేత, వితంతు, వృద్ధాప్య పింఛన్లతోపాటు, కిడ్నీ బాధితులకు పింఛన్ ఇవ్వడంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ చేయిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 60 ఏండ్లు ఓపిక పట్టిన దళితులు మరో ఆరేడు సంవత్సరాలు ఓపిక పడితే మీ భవిష్యత్తే మారిపోతుందన్నారు. దళిత బంధు ప్రారంభించి ఏడాదైందని, రాష్ట్రంలోని 17 లక్షల మందికి ఏడేండ్లలో ఇంటింటికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.