Koppula Eshwar | హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకుండా, రాసిచ్చిన స్క్రిప్ట్తో మాట్లాడారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం మీడియా సెంటర్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. రాహుల్, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడైన రాహుల్ గాంధీ పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. మూడేళ్ల రికార్డ్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీటి అందిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాధారమని, ఒకనాడు కరువుతో అల్లాడిన రాష్ట్రం నేడు సస్యశ్యామలమైందంటే అందుకు ఆ ప్రాజెక్టే కారమణమని కొనియాడారు. అలాంటి ప్రాజెక్టుపై రాహుల్గాంధీ అడ్డగోలుగా మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కొప్పుల ఈశ్వర్ వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్లు ఇవ్వలేని వారు తెలంగాణలో రూ. 4 వేల పెన్షన్ ఇస్తామనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పోడు భూముల పంపిణీ కొనసాగుతున్నదని, అయినా అధికారంలోకి వచ్చి పట్టాలు పంపిణీ చేస్తామనడం రాహుల్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇక ఎవరికి ఎవరు బీ టీమో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని అరెస్ట్ చేస్తారని చెప్పి చేయలేదని, దాన్ని బట్టే బీ టీం ఎవరో అర్థమవుతుందని కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, గురుకుల పాఠశాలలు ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయడం లేదని, తెలంగాణలో మీ మాటలు నమ్మేవారు ఎవరూ లేరని వివరించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు భట్టి విక్రమార్కను వేదిక మీదనే తోసివేసి పీసీసీ నాయకుడు రేవంత్రెడ్డి తన సంసారాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.