ధర్మపురి: బీజేపి దొంగల పార్టీ, అవినీతి పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకునే దురహంకార పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. బీజేపి ప్రభుత్వం పేద ప్రజల మనుగడ పట్ల ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని కొప్పుల ఈశ్వర్ విరుచుకుపడ్డారు.
బుధవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 74 మంది లబ్దిదారులకు రూ. 21,72,500 ల విలువ గలగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 15 మందికి రూ. 15లక్షల విలువ కలిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచుతూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని మండిపడ్డారు. మన ఇంటికి దొంగలు వస్తే కుటుంబసభ్యులంతా ఒక్కటై ఇంటి యజమానిని బలపరుస్తూ దొంగలను తరిమికోట్టినట్లే.. మనమంతా ఒక్కటిగా ఉండి సీఎం కేసీఆర్ను బలపరుస్తూ..రాష్ట్రంలో బీజేపి ఆనవాళ్లు లేకుండా తరమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. పేదోన్ని కొట్టు..పెద్దోనికి పెట్టు..అన్న చందంగా బీజేపీ పాలన తయారైందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే క్రమంలో కలుపు మొక్కలుగా బీజేపీ నాయకులు తయారు అయ్యారని మండిపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ అరుణ, తహసీల్దార్ వెంకటేశ్, మున్సిపల్ కమీషనర్ రమేశ్, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, కౌన్సిలర్లు అయ్యోరి వేణు, బండారి అశోక్, యూనుస్, అనంతుల విజయలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు అలీమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.