ధర్మపురి, మే 17 : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తపన, పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధన సులువేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం సంక్షేమ శాఖ, ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో ధర్మపురి పట్టణంలోని షాధీఖాన, న్యూటీటీడీ కల్యాణ మండపాల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను మంగళవారం మంత్రి సందర్శంచి ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపికై సమాజంలో గుర్తింపు పొందడంతో పాటు తల్లిదండ్రుల కలలు సాకారం చేసినట్లవుతుందన్నారు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 91వేల ఉద్యోగాలు ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు. ఉచిత స్టడీ మెటీరియల్ను ఉద్యోగార్థులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఉచిత కోచింగ్తో పాటు మధ్యాహ్న భోజనం సౌకర్యం కూడా కల్పించామని మంత్రి తెలిపారు.
ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని కూడా కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. మైదానంలో మినీ స్డేడియం ఏర్పాటుకు రూ.2.65 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ స్నేహలత తదితరులున్నారు.