ధర్మపురి : భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ధర్మపురికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి దివంతగత కేవీ కేశవులు స్వగృహంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కేవీ కేశవులు స్వగృహానికి చేరుకున్న మంత్రికి పోలీసులు గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు.
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మొదటి భారత స్వాతంత్య్ర యుద్దంగా, పౌర తిరుగబాటుగా పరిణమించబడిన..1857 మే 10న మీరట్లో సిపాయిలతో మొదలైన తిరుగుబాటు 1858లో అణిచివేయబడ్డప్పటికీ, ఆ తిరుగుబాటు స్పూర్తిగా ఆనాటి మహనీయులు పోరాటాన్ని కొనసాగించి అప్పటి నుండి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించే వరకు దాదాపు 90సంవత్సరాలు పాటు నిరంతరం పోరాటం చేసిన ఫలితంగానే స్వాతంత్రం సిద్దించిందన్నారు. ఆ స్పూర్తిని ప్రజల్లో నింపేందుకే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. అనేక మంది మహనీయులు ప్రాణాలను ఫణంగా పెట్టి స్వాతంత్రం తీసుకువచ్చిన తీరును భావితరాలను తెలియజేప్పేలా 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వజ్రోత్సవాల్లో పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఇలా యావత్ తెలంగాణ ప్రజానీకం పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
ధర్మపురికి చెందిన స్వాతంత్ర సమరయోధులు కేవీ కేశవులు, మాణిక్య శర్మలు ధర్మపురికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. వీరి పోరాట స్ఫూర్తిని ఇక్కడి ప్రజల్లో నింపేలా, భావితరాలకు వీరి గొప్పతనాన్ని తెలియజెప్పేలా ధర్మపురిలో ఇద్దరి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. వారి జయంతి, వర్ధంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొనడం సామాజిక బాధత్యగా ప్రతీ పౌరుడు గుర్తించి విజయవంతం చేయాలని పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్నేత పిలుపునిచ్చారు. మంగళవారం ధర్మపురిలో వజ్రోత్సవాల్లో భాగంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత జాతీయతను, స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తిని, వారి సిద్దాంతాలను, భారతదేశ గొప్పతనాన్ని ఇంటింటికీ తెలియజేసి భావితరాల్లో స్పూర్తిని నింపడంతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారత పౌరులందరూ సోదరభావంతో మెలిగి, జాతీయ భావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో, సామాజిక బాధ్యతగా కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు కౌన్సిలర్లు అయ్యోరి వేణుగోపాల్, కిరణ్మయి, తరాల్ల కార్తీక్ , గుర్రాల సుధాకర్, వొడ్నాల ఉమాలక్ష్మి, కొంపల పద్మ, సయ్యద్ యూనుస్, అనంతుల విజయలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు అప్పాల వసంత్, సయ్యద్ అలీమ్, నాయకులు సంగి శేఖర్, చిలవేరి శ్యాంసుందర్, ఇనుగంటి వెంకటేశ్వర్రావ్, బాతరపు గుండయ్య, మురికి శ్రీనివాస్, గడ్డం బాలరాజు తదితరులున్నారు.