పెద్దపల్లి : పేదలందరు గౌరవప్రదంగా భద్రతతో జీవించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలంలో నూతనంగా 1783 లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇస్తుందని మంత్రి తెలిపారు.
హెచ్.ఐ.వి, బోదకాలు బాధితులతో పాటు తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు అందించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. అనేక పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలిపారన్నారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మజ, ఎంపీపీ కరుణశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, బలరాం రెడ్డి, బంధం రవి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.