ధర్మపురి,సెప్టెంబర్ 29 : పారిశుధ్య సిబ్బంది, ఆటోడ్రైవర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య సిబ్బంది, ప్రజారవాణాలో ఆటోవాలాలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎస్హెచ్ గార్డెన్స్లో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 1892 మంది ఆటోడ్రైవర్లు, పారిశుధ్య సిబ్బందికి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. రోడ్ ట్యాక్స్, గతంలో ఉన్న బకాయిలను రద్దు చేసిందని గుర్తు చేశారు. భవిష్యత్లోనూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులు లేనిదే ప్రజారోగ్యం లేదన్నారు. వారు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తారని పేర్కొన్నారు.
శ్రీ తులసీ హెల్త్కేర్ సర్వీసెస్ ద్వారా 1892 మందికి రూ. 2 వేల చొప్పున మొత్తం రూ.37.87 లక్షలు వెచ్చించి కార్డులు అందించామని తెలిపారు. ఈ కార్డుల ద్వారా ఉమ్మడి జిల్లాలోని 54 దవాఖానల్లో 40 శాతం డిస్కౌంట్తో చికిత్స పొందవచ్చన్నారు. అలాగే రూ. లక్ష బీమా సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జీలు, పేషెంట్ ఫుడ్, పేషెంట్ కిట్, పేషెంట్ లిక్విడ్ను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ ఉన్నారు.