పెద్దపల్లి : తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సుల్తానాబాద్ మండలం గరెపల్లి గ్రామంలో శుక్రవారం మంత్రి చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. అలాగే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని సంకల్పించారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల 50 వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారంలో ఉన్న పాలకులు ఏనాడు ప్రజలకు ముఖ్యంగా మహిళల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
కార్యక్రమంలో పెద్ధపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.