పరకాల, ఏప్రిల్ 14: మంత్రి కొండా సురేఖ వద్దకు వెళ్లే కాంగ్రెస్ శ్రేణులు తన వద్దకు రావొద్దని పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వ్యాఖ్యలపై కొండా అనుచరులు నిరసన తెలిపారు. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కనీసం సమావేశాల సమాచారం కూడా లేదని వాపోయారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరకాలలో రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు యశస్వినీరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు.
సమావేశం జరుగుతుండగా కొండా వద్దకు వెళ్లే పార్టీ శ్రేణులు తన వద్దకు రావొద్దంటూ రేవూరి వ్యాఖ్యలు చేయడంతో.. కొండా వర్గీయులు ‘జై కొండా, జిల్లా టైగర్ కొండా మురళి’ అంటూ సభా వేదిక మీదకు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా మరో వర్గం శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. జై కొండా అంటూ నినాదాలు చేసిన గజ్జి విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఆగ్రహించిన విష్ణు వర్గీయులు స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు.
కాంగ్రెస్లో గ్రూపు వార్ మరోసారి బహిర్గతమవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ వద్ద జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో గ్రూపు రాజకీయాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో కొండా మురళీధర్రావు మీసం తిప్పడం, ఇనుగాల వెంకట్రామ్రెడ్డి తొడలు కొట్టడం, ఇరువర్గాల శ్రేణులు నినాదాలు చేయడంతో పరిశీలకులు అక్కడి నుంచి వెళ్లిపోగా సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం నిర్వహించిన నియోజకరవ్గస్థాయి సమావేశంలో మరోసారి గ్రూప్ వార్ బహిర్గతమైంది.
ఇందులో తమను చిన్నచూపు చూస్తున్నారంటూ కొండా వర్గీయులు పలువురు ఎమ్మెల్యేలు, అభ్యర్థి ముందే నిరసన తెలపడంతో నియోజకవర్గస్థాయి సమావేశం గ్రూపు రాజకీయాలకు వేదికగా మారింది. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించగా.. కొండా వర్గీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీరా సభకు మంత్రి గైర్హాజరవడం, మంత్రిపై ఎమ్మెల్యే రేవూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్ని లేపాయి. రేవూరిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కొండా దంపతులు అహర్నిశలు కృషి చేశారని, వారి కృషితోనే ఎమ్మెల్యేగా గెలిచి, తీరా గెలిచాక ఇలా వ్యవహరించడం ఏమిటని కార్యకర్తలు వాపోతున్నారు.