Konda Surekha|వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మరింత ముదురుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు ధర్మకర్తలను కొండా సురేఖ నియమించడంపై ఎమ్మెల్యే నాయిని ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా.. దానిపై తాజాగా మంత్రి కూడా స్పందించారు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ లేదా అని ఆమె ప్రశ్నించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. నాయిని రాజేందర్ రెడ్డిపై తాను వ్యాఖ్యలు చేయదలచుకోలేదని వ్యాఖ్యానించారు. అయినా తనకన్నా ముందు ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ఇప్పుడు అయ్యాడని విమర్శించారు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో గుడిలో ఇద్దరు ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ తనకు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆ భర్తీ చేసిన పోస్టులు కూడా అధిష్ఠానం పంపించిన పేర్లే అని ఆమె వివరించారు. నాయిని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
ఇటీవల వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకంపై వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో దుమారం రేగింది. ఈ విషయంలో కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. అలాగే కొండా సురేఖపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే నష్టం జరుగతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని అని ఆయన ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా అని నిలదీశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది దేనికని, తన ఓపికకు పరీక్ష పెట్టవద్దని హెచ్చరించారు.