రంగారెడ్డి : ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ సరస్సు వద్ద నిర్వహించిన ‘చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం ’(Wetlands) వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు, చిత్తడి నేలలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను మంత్రి పరిశీలించారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణ, చిత్తడి నేలల సంరక్షణకు అనుసరించాల్సిన విధానాలపై మంత్రి సురేఖ మాట్లాడారు. పూర్వకాలంలో కాలుష్యం ఉండేది కాదన్నారు. జనాభా పెరుగుతున్నది కొద్దీ ప్రజలు అవగాహన లేమితో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంటంతో కాలుష్యం పెరుగుతున్నదన్నది పేర్కొన్నారు. ప్లాస్టిక్ మానవాళి పట్ల శాపంగా మారిందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపర్ బ్యాగులను వాడాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.
పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు పర్యావరణ పరిరక్షణ దిశగా విద్యార్థులను ప్రోత్సాహించాలని సూచించారు. చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ సెక్రటరీ ఖాళిచరణ్ ఎస్ ఖర్తడే, ఎం. సునీల, శిల్పా శర్మ పాల్గొన్నారు.