నల్లగొండ : 5 సంవత్సరాల లోపు పిల్లలు పోలియో వ్యాధి దారిన పడకుండా ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు(Polio drops) వేయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలోచిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలియో వ్యాధి బారినపడిన పిల్లలకు అంగవైకల్యం సంభవిస్తుందని అందువల్ల అంగవైకల్యం బారిన పడకుండా పిల్లలను రక్షించుకునేందుకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో సుమారు 1,61,925 మంది ఐదు సంవత్సరాలు లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిందన్నారు. ఇందుకుగాను 981 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, 3,924 మంది ఉద్యోగులను పోలియో చుక్కలు వేసేందుకు నియమించినట్లు మంత్రి తెలిపారు.