హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ మండలంలో హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్కుమార్ శావిలి, జస్టిస్ టీ వినోద్కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి వెంకట్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సౌకర్యాల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అత్యాధునిక పద్ధతిలో నిర్మించే ఈ భవనంలో కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులకు సకల సౌకర్యాలు ఉంటాయని వివరించారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్, పంచాయతీరాజ్ కార్యదర్శి, ఎం రఘునందన్రావు, న్యాయశాఖ కార్యదర్శి రేండ్ల తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హోళికెరితోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు.