కరీంనగర్ : నగరాన్ని రాష్ట్రంలోనే రెండో గొప్పనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో రూ.2.80కోట్లతో ఆధునికీకరించిన స్కేటింగ్ రింగ్ బాస్కెట్ బాల్కోర్టు, ఇండోర్ స్టేడియాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర, రాష్ట్ర కాంట్రిబ్యూషన్తో కరీంనగర్ పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
క్రీడలు భావితరానికి బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో స్టేడియంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్ పట్టణంలో డంపింగ్ యార్డ్, 24 గంటలు తాగునీటి సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా నగరాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులు వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించేందుకు ప్రభుత్వం తగినన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఇన్వెస్ట్మెంట్లో తెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా తదితర ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో గ్రామాలు పట్టణాలు శుభ్రంగా, అందంగా ఉన్నాయన్నారు. హరితహారం కింద మొక్కలు నాటి పరిరక్షించడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను అభివృద్ధి చేస్తామన్నారు. నిధులు సీఎం అష్యూరెన్స్ రెన్స్ నిధులతో రోడ్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
టీఆర్ఎస్ పార్టీ తపన, ఊపిరే తెలంగాణ అభివృద్ధి అన్నారు. మంత్రి అనంతరం మంకమ్మ తోటలో స్కిల్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరీ శంకర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, నగరపాలిక కమిషనర్ సేవ ఇస్లావత్, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, మున్సిపల్ ఈఈ టీవీ రామన్, మున్సిపల్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.