కామారెడ్డి : పంట(Crops) నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు( Farmers) అధైర్యపడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పరిశీలించారు. బిక్నూర్ మండలం మాసుపల్లి, జంగంపల్లి, దోమకొండా మండలం లింగుపల్లి గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాని అధికారులను ఆదేశించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సర్వే పూర్తికాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థికసాయం చేస్తామననారు. 4-5 ఎకరాలున్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ పూర్తి చేస్తామని చెప్పారు.